Sunday, December 14, 2025

సునీల్ రావు బీజేపీలోకి చేరడానికి కారణమేంటి?

మేయర్ పదవి కోసమేనా?
అవకతవకలు తప్పించుకోవడానికా?
బీఆర్ఎస్ లో ఇమడలేకనా?

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్లో చాన్నాళ్ల తర్వాత రాజకీయం రసవత్తరంగం మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కు ఆ తర్వాత బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్లో ఇప్పుడు బీజేపీ జెండా రెపరెపలాడడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కరీంనగర్ లో బిజెపి ఉన్నా.. పార్లమెంటు సీటు వరకే పరిమితమైంది. అయితే బిజెపి నాయకుడు బండి సంజయ్ పార్టీని పటిష్టం చేయడంలో సఫలీకృతుడయ్యారని అంటూ ఉంటారు. కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మారి.. ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు. అయితే సొంత జిల్లా కరీంనగర్ లో పార్టీని విస్తృతపరచడంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణ తాజాగా కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావుతోపాటు కొంతమంది కార్పొరేటర్లు బిజెపిలోకి చేరడమే నని తెలుస్తోంది. కొంతకాలంగా సునీల్ రావు ఇతర పార్టీలోకి మారుతారు అన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన ఏ పార్టీలోకి మారుతారునేది స్పష్టత లేదు. తాజాగా శనివారం ఆయన ఓ ఫంక్షన్ హాల్ లో పదిమంది కార్పొరేటర్లతో కలిసి బిజెపిలోకి బండి సంజయ్ సమక్షంలో చేరారు. యాదగిరి సునీల్ రావు బీజేపీలోకి చేరడానికి కారణాలేంటి..? అన్న చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణ మేనల్లుడు అయిన యాదగిరి సునీల్ రావు మేనమామ బాటలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ తర్వాత కార్పొరేటర్ గా గెలిచారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లిన సునీల్ రావు రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పదవిని దక్కించుకున్నారు. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ వశయమయ్యాయి. కరీంనగర్ నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో పడింది. అప్పటినుంచి సునీల్ రావు ఇతర పార్టీలోకి మారుతారు అన్న ప్రచారం సాగింది.

ఇదిలా ఉండగా పార్టీలో అంతర్గత కొమ్ములాటలు ఉన్నట్లు సమాచారం. పార్టీలోని కొందరు నాయకులతో సునీల్ రావు కు విభేదాలు ఉన్నట్ల కొందరు అనుకుంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని కొంత సొంత పార్టీ నేతలే సునీల్ రావు పై విమర్శలు చేశారు. గతంలో ఈ విభేదాలు బయటపడడంతో పార్టీ అధిష్టానం సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేసినట్లు సమాచారం.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కి కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఆయనకు మేయర్ సునీల్ రావ్ దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కొందరు సొంత పార్టీ నేతలు సునీల్ రావు వ్యవహారంపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. ఈ విమర్శలపై సునీల్ రాజ్ స్పందించి కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల కోసమే బండి సంజయ్ తో కొన్ని కార్యక్రమాలకు వివరించారు. తాను ఎప్పటికైనా బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

మరోవైపు మేయర్ పదవీకాలం ముగియడంతో వచ్చే ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకోవడానికి సునీల్ రావు బీజేపీలోకి వెళ్లినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ తో పాటు బిజెపి కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు. తాజాగా సునీల్ రావు తో పాటు మరికొందరు చేరి.. వీరు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి మేయర్ పదవి సాధించవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొంత కాలంగా స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పనుల్లో మేయర్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో ఎన్నో ఆకుతోకలు జరిగాయని, ఈ అవకతవకలు బయటపడకుండా ఉండడానికే సునీల్ రావు బిజెపిలోకి చేరారని అంటున్నారు.

కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావు ఉండడంతో బీఆర్ఎస్ పటిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కీలక నేత అయిన సునీల్ రావు బిజెపి లోకి చేరడంతో పార్టీ పరిస్థితి పై కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అలాగే బిఆర్ఎస్ లోని కొందరు కార్పొరేటర్లు గతంలో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మరి కొంతమంది బిజెపిలోకి వెళ్లడంతో ఆ పార్టీకి గడ్డ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular