అసెంబ్లీలో విలేకరుల రక్షణకు చట్టం చేయాలి
- జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్
కరీంనగర్, నిఘా న్యూస్: నిరంతరం ప్రజాసంక్షేమమే ద్వేయంగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న విలేకరులను గుర్తించాలని తెలిపారు. వారికోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు వార్త రూపంలో ప్రభుత్వానికి చేరేవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని చెప్పారు. జీతభత్యాలు లేకుండా నిత్యం సమస్యలను వెలికితీయడంలో ముందుండే జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు పైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాంటిది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించదని ప్రశ్నించారు. అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు బస్సులలో 1/3 కాకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.


