చొప్పదండి, నిఘా న్యూస్: భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పొనగంటి నవీన్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, దోషరహితమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ప్రత్యేక సర్వే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.
స్థానికంగా నిర్వహించిన బూత్ స్థాయి అధికారుల (BLOలు) సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే బీఎల్వోలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఓటరు వివరాలు, ఫొటోను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన సవరణలు ఉంటే తెలియజేసి, ధృవీకరణ అనంతరం సంతకం చేసి వారికి అందజేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు గుర్రం రాజేందర్ రెడ్డి, అశోక్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎంపీడీవో వేణుగోపాల్, కొండగట్టు ఆంజనేయస్వామి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎన్నికల విభాగానికి చెందిన రిశ్మా, గిర్దావర్లు త్రిపాల్ సింగ్, రహీమ్, జీపీఓలు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


