అప్పుల బాధే కారణమా?
జగిత్యాల, నిఘా న్యూస్: అప్పుల బాధ తాళలేక బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామానికి చెందిన సింహాచలం జగన్ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో కొంతకాలంగా ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. అయితే స్థానికులు తెలుపుతున్న ప్రకారం.. అప్పులు, వాటికి సంబంధించిన ఈఎంఐల చెల్లింపుల ఒత్తిడితో జీవితంపై విరక్తి చెందినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు జగన్ రాసిన లేఖలో తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను చేసిన అప్పుల బాధను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. తన జీవితంలో కుటుంబానికి ఆశించిన స్థాయిలో ఏమీ చేయలేకపోయాననే ఆవేదనను కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని, తన కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని లేఖలో వేడుకున్నట్లు సమాచారం. జగన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సింహాచలం జగన్ గతంలో గుళ్లకోట గ్రామంలో వార్డు సభ్యుడిగా, అనంతరం సర్పంచ్గా కూడా పనిచేశారు. రాజకీయంగా కూడా చురుకుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.జగన్ అకాల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


