కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో స్థానికులతో కలిసి అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఏర్పాటు చేసిన షెడ్డు రేకులను తొలగించారంటూ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శ్రీరాజరాజేశ్వర కాలనీలో సర్వే నంబర్ 126లోని ప్లాట్ నంబర్ 273కు సంబంధించి శ్రీకర్, గాండ్ల లక్ష్మీనారాయణతో పాటు మరికొందరి మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కరీంనగర్ ఆర్డీవో ఇప్పటికే ‘స్టేటస్ కో’ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే సంబంధిత స్థలంలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆదేశించారు.
అయితే ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానికులతో కలిసి వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించారని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసిన షెడ్డు రేకులను తొలగించినట్లు ఆరోపించారు. ఈ విషయంపై అందుబాటులో ఉన్న వీడియో క్లిప్పింగులను కూడా పరిశీలించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై భారతీయ న్యాయ సురక్ష సంహిత (BNSS)-2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా స్టేటస్ కో అమల్లో ఉన్న భూమిలో ప్రవేశించడం చట్టవిరుద్ధమని, దీనిని నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తన ఫిర్యాదులో కోరారు.
ఈ భూమి వివాదానికి సంబంధించి శ్రీకర్, గాండ్ల లక్ష్మీనారాయణతో పాటు ఇతరుల మధ్య వివాదం కొనసాగుతోందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల నివేదికలు, వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వాస్తవాలను నిర్ధారించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కేసు నమోదు కావడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


