కౌన్సిలర్ రామతీర్థపు మాధవి
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణీలకు శ్రీమంతం
వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలోని 9వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలను మున్సిపల్ మాజీ చైర్మన్, కౌన్సిలర్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతాశిశు సంక్షేమం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాతాశిశు ఆరోగ్యం కోసం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ఆడబిడ్డ పుడితే ₹13,000, మగబిడ్డ పుడితే ₹12,000 ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఆ ఆర్థిక భరోసా ఎక్కడా కనిపించడం లేదని, బాలింతలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ‘కేసీఆర్ కిట్’ పథకం కూడా అందకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రభుత్వం ఇప్పటికైనా మాతాశిశు సంక్షేమంపై దృష్టి సారించాలని, గతంలోని సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం గర్భిణీలకు పండ్లు, పూలు, పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కే. లత, ఏఎన్ఎమ్ సృజన, ఆశా వర్కర్ లత తదితరులు పాల్గొన్నారు.


