కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా పనిచేశారు..
మంచి ఫలితాలు సాధించారు..
కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచారు..
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు చాలా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. ప్రచారం తీరు.. ప్రత్యేకంగా చేపట్టిన ప్రణాళిక.. ఎన్నికల ఫలితాలు.. తధానంతర పరిణామాలు..కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం.. గతంలో 0 నుంచి 14 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఎదగడం.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజేందర్రావు ముఖ్యమంత్రితో చర్చించారు.
అన్ని విషయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు. రాజేందర్ రావు కు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు సలహాలు అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేందర్ అన్న మీరు చాలా బాగా పనిచేశారు. ప్రజల్లో మీ మీద మంచి అభిప్రాయం ఉంది. పార్టీ గ్రాఫ్ పెంచారు. పట్టుదలతో పని చేస్తూ, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారనీ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఎమ్మెల్యే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి ఇంకా పార్టీ గ్రాఫ్ను పెంచాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు అహర్నిశలు కష్టపడి పని చేయాలని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని రాజేందర్రావుకు ముఖ్యమంత్రి సూచించారు. స్వార్థం లేకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించారని సీఎం ప్రశంసించారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే ఎన్నికైన కార్పొరేటర్లను కలుస్తానని, కరీంనగర్కు వచ్చి బహిరంగ సభలో పాల్గొని కరీంనగర్ ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రకటిస్తామని రాజేందర్ రావు తో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పదిమంది అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని రాజేందర్రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఏమాత్రం అధైర్య పడకుండా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా పేదలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. కరీంనగర్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారి కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సీఎం సూచించారు.
కరీంనగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారని రాజేందర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెన్ను తట్టి అభినందించడం మరిచిపోలేనని రాజేందర్రావు పేర్కొన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ముందుకెళ్తానని తెలిపారు. కరీంనగర్ గడ్డను కాంగ్రెస్ అడ్డాగా మారుస్తామని రాజేందర్ రావు పేర్కొన్నారు.


