ఆశావహుల్లో ఆనందం
పైరవీలు ప్రారంభం
ఉమ్మడి జిల్లాలో పలు పోస్టులు
కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: వచ్చే నెల 15లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది . వెనువెంటనే పైరవీరులు ప్రారంభించారు .దీంతో నామినేటెడ్ జాతర ప్రారంభమైంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి .ప్రారంభంలోనే నామినేట్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఇప్పటికీ కొంతమంది ఆశావహుల ఆశలు నెరవేరేవి. ప్రారంభంలో పరిపాలనపై దృష్టితో ఏడాది కాలంగడిచింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం పచ్చ జెండా ఊపింది . దీంతో రాష్ట్రంలో కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర సాహిత్య అకాడమీ , అధికార భాషా సంఘం అధ్యక్ష పదవుల కోసం జిల్లాలో వేచి చూసేవారు ఉన్నారు. అందుకు కారణం.. జిల్లాలో అత్యధిక సాహితీవేత్తలు ఉండడమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆశావాహులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏడాదికాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ క్రమంలో వారంతా మరో మారు తమ ప్రయత్నాలు వేగవంతం చేశారు. పై రెండు రాష్ట్రస్థాయి పదవులు జిల్లాకు దక్కే అవకాశాలు లేకపోలేదని సాహితీవేత్తలు భావిస్తున్నారు. ఇదేవిధంగా జిల్లా వరకు పరిమితమైన పదవులు కూడా ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రముఖ ఆలయాలు వేములవాడ, కొండగట్టు ,ధర్మపురి ప్రధానమైనది. వాటితో పాటు మార్కెట్ కమిటీలు పాలకవర్గాలు లేకుండా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిన్న చిన్న ఆలయాలు 100 మేరకు ఉండవచ్చు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు సైతం పాలక వర్గాలను నియమించాల్సింది . ఆహార కమిటీలు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా వడపోస్తే వందల సంఖ్యలో భర్తీ చేయాల్సి ఉంది. దీనికోసం అయితే సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా పార్టీ పరంగా బాధ్యులైన వారిని ప్రసన్నం చేసుకోవాల్సింది. అధికారిక పోస్టులతో పాటు పార్టీ పరమైన ఖాళీలు కూడా ఉన్నాయి. వాటికోసం సైతం ఎదురుచూసేవారు ఉన్నారు. ఏకంగా పిసిసి ప్రకటనతో పైరవీలు ప్రారంభించారు. పదవులు ఇక ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సిందే.


