కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
వేములవాడ, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వేములవాడ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని గత పాలకులు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.గతంలో బీజేపీ, బీ ఆర్ ఎస్ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వారు చేసిన అభివృద్ధి పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ప్రజలకు అండగా ఉన్నారని పేర్కొంటూ, మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.


