కరీంనగర్, నిఘా న్యూస్:టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి హనుమంతుడి పై చేసిన వ్యాఖ్యల ఫలితంగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై వానరసేన సభ్యులు పోలీసులకు ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హిందువుల నుంచి కూడా అతనికి తీవ్ర వ్యతిరేకమైన పవనాలు వేస్తున్నాయి. మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా రాజమౌళి వాక్యాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రాజమౌళి పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా కరీంనగర్ లోని బిజెపి మాజీ కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని కొందరు డబ్బులు సంపాదించడానికి హిందూమతంపై అనుచిత వాక్యాలు చేస్తున్నారని అన్నారు. ఇతర మతాలకు కొమ్ము కాసే విధంగా హిందూ మతంపై మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. హిందూ మతంపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇతర మతాల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి.. కానీ వాటిని పట్టించుకోకుండా హిందూ మతం వారికి చులకనగా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు.
హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అందరికీ అనుకూలంగా ఉంటాయని, మంచితనం, మానవత్వం ఉంటుందని.. అయితే వీటిని ఆసరాగా తీసుకొని సినిమాకు చెందిన కొందరు హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కానీ ఇలాగే వాక్యాలు చేస్తే మాత్రం సహించబోమని రాపర్తి ప్రసాద్ హెచ్చరించారు.


