Friday, February 27, 2026

కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం.. రోగుల భద్రత ప్రశ్నార్థకం

కరీంనగర్, నిఘా న్యూస్: “ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయా?” అన్న ప్రశ్న కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో మరింత బలంగా వినిపిస్తోంది. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం, మరియు రక్షణ చర్యల కొరత రోగుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇటీవల దీప్తి అనే ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అమ్మాయిపై అఘాయిత్యం సంఘటన, ఆసుపత్రుల భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. రాత్రి వేళల్లో, సరైన భద్రతా సిబ్బంది లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం లేదా పనిచేయకపోవడం వంటి కారణాలతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆసుపత్రుల్లోనే ఇలాంటి దారుణాలు జరగడం అత్యంత విచారకరం.

సౌకర్యాల కొరత, అధిక వసూళ్లు:
అధిక సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ, వాటిలో సగం కంటే ఎక్కువ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలకు అవసరమైన సరైన సౌకర్యాలు అందుబాటులో లేవు. నాణ్యమైన వైద్యం అందించడానికి బదులుగా, రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా కొన్ని ఆసుపత్రులు పనిచేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చికిత్సకు సంబంధం లేని పరీక్షలు చేయించడం, అవసరం లేకున్నా ఖరీదైన మందులు వాడమని చెప్పడం, బిల్లుల్లో అదనపు ఛార్జీలు వేయడం వంటి పద్ధతులతో రోగులను దోచుకుంటున్నారు.

అత్యధిక వసూళ్లు
ఆసుపత్రులు రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ప్రతి చికిత్సకు, పరీక్షకు నిర్దిష్టమైన, సహేతుకమైన ధరలను నిర్ణయించి, వాటిని బహిరంగంగా ప్రదర్శించేలా ఆదేశించాలి. బిల్లుల్లో పారదర్శకత ఉండేలా చూడాలి.ప్రభుత్వ అధికారులు ఆసుపత్రుల్లో నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం నిఘా పెంచాలి

చీకట్ల శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు, జర్నలిస్టుల సంక్షేమ సంఘం.


ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఆసుపత్రిలోనూ, ముఖ్యంగా మహిళా రోగులు, ఒంటరిగా ఉన్నవారికి రక్షణ కల్పించేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యమైన ప్రదేశాల్లో, వార్డుల్లో, కారిడార్లలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలి. సీసీ కెమెరాల ఫుటేజీని నిత్యం పర్యవేక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, ముఖ్యంగా నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందిని ఎంపిక చేసేటప్పుడు వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. క్రిమినల్ రికార్డులు లేని వారిని మాత్రమే నియమించాలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular