హైదరాబాద్, నిఘా న్యూస్: బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆ తర్వాత తానే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని వెల్లడించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రాని కి ప్రీ-ఫీజిబులిటి రిపోర్ట్ ను నేరుగా ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు.
అది ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదని చెప్పారు. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదని, అలాగని రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మోదీ ప్రధాని సీట్లో కూర్చోవా లంటే చంద్రబాబు మద్దతు కావాలని, అందుకే, ఏపీ సర్కారు పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పంది స్తోందని, 18 నెలలుగా తాము ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇద్దరు సీఎంలు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒకరోజు కాకపోతే నాలుగు రోజులైనా చర్చలకు సిద్ధమే. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య చర్చల ద్వారానే జల వివాదాలు పరిష్కారమవుతాయని తెలంగాణ వంద శాతం విశ్వసిస్తోందని.. అనవసర రాద్ధాంతాలు తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణతో ఎటువంటి సంప్రదింపులూ జరపకుండా ఏపీ సర్కారు నేరుగా కేంద్రం వద్దకు వెళ్తుండడంతో అది బీఆర్ఎస్ కు ఆయుధంగా మారుతోందని తెలిపారు. ‘బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయింది. ఇప్పుడు జల వివాదాలను సంజీవనిగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల క్రితం ఎటువంటి జల వివాదాలు ఉన్నాయో.. ఇప్పటికీ అవే ఉన్నాయి.
నాటి సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల మంత్రి హరీశ్ రావు వల్ల మరింత జఠిలంగా మారాయి. చేసిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడే మో తనకేమీ తెలియదన్న ట్లు హరీశ్ డ్రామాలు ఆడుతున్నారు. అని ధ్వజమెత్తారు. బనకచర్లకు బీజం పడింది 2016లోనే నని రేవంత్రెడ్డి తెలిపారు. సర్వే చేయాలంటూ 2016-18 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, అప్పుడే కేసీఆర్ కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు.