కరీంనగర్, నిఘాన్యూస్: ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆయా పాఠశాలల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలను పేర్చి ఒక్కచోట చేర్చారు, ఆ తరువాత బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా కోలాట నృత్యాలు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల యందు గత మూడు రోజుల నుండి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు వేడుకలు భగత్నగర్ లోని సిద్ధార్థ విద్యాసంస్థ యందు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో విద్యార్థులందరు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను పేర్చేవిధానాన్ని భావితరాల వారికి తెలియజేయడానికై విద్యార్థులకు తరగతులవారిగా బతుకమ్మ తయారీ పోటీని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల మాతృమూర్తులకు బతుకమ్మ తయారీ పోటీని నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని ప్రముఖమైన జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో బతుకమ్మను ఆడే వైవిధ్యమైన విధానాలను విద్యార్థులు ఆటపాటలతో ప్రదర్శించారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన కోలాటము, దాండియా పలువురిని ఆకట్టుకున్నాయి. జానపదులు బతుకమ్మను పేర్చిన విధానమునుండి మొదలుకొని నిమజ్జనం వరకు జరిగే పక్రియను కళ్ళకు కట్టినట్టుగా విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ సంస్కృతి విద్యార్థులకు తెలుస్తుందని, వారిలో ఆధ్యాత్మిక పట్ల, మన సంప్రదాయం పట్ల అవగాహన కలుగుతుందని విద్యార్థులనుద్దేశించి అన్నారు. మాతృమూర్తులు అందంగా అలంకరించి తీసుకువచ్చిన బతుకమ్మకు పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లి దండ్రులు పాల్గొన్నారు.






