కర్షకుల కన్నీరు.. తడిసి ముద్దయిన ధాన్యం కుప్పలు…
నేలకొరిగిన వరి పొలాలు..
- తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని రైతుల డిమాండ్…
- గంభీరావుపేట ఏప్రిల్ 20 (నిఘా న్యూస్ ): ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ శనివారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షం రైతుల వెన్ను విరిచింది. పలుచోట్ల కోసిన వరిధాన్యం కుప్పలు కల్లాలలో నీట తడవగా గాలుల తాకిడికి పంట నేలనంటింది. ధాన్యం రాశులు వర్షానికి తడవకుండా ఉండేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. గంభీరావుపేటమండలం లోని పలు గ్రామల్లో శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తెల్లవారుజామున ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో 5గంటలనుంచి ఉదయం 9గంటల వర కూ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడవచ్చునని భావించినా ఆకస్మికంగా వర్షం పడడంతో వరి రైతులకు శాపంగా మారింది.ఎగువ మానేరు ఆయకట్టులో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా పలు ప్రాంతాల్లో కోసిన వరిపంట కల్లాల్లోనే ఉండిపోయిం ది. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో పంట మరో వా రంరోజుల్లో కోతకు వచ్చే దశలో ఉంది. ఇటువంటి తరుణం లో పడిన వర్షంతో దాన్యం కుప్పలు వర్షపు నీటతడిచిపోయాయి. వర్షం ఇంతటితో తగ్గితే పర్వాలేదని లేకుంటే ధాన్యం రంగుమారే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నేలనంటింది. నేలకు వాలిన పం టపై వర్షం కురవడంతో పంట మొలకెత్తే అవకాశముందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నేల పాలయింది…
-బొంగు రవి యాదవ్ రైతు, నర్మాల

ఈ యాసంగి సీజన్లో వరి పంటలో అధిక చీడపీడలతో దిగుబడి తగ్గింది. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంతో కల్లాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేస్తే బాగుంటుంది.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి…
-ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం…

అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన పంట చేతికందే లోపే వర్షం రైతులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. తడిసిన వరి ధాన్యాన్ని ఏలాంటి తరుగు కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.


