రూ.14 వేల నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం సీజ్
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట జనవరి 22 (నిఘా న్యూస్)కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇటుకలు, బేస్మెంట్ రాయి సరఫరా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.ఈ సందర్భంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రుత్విక్ సాయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.చల్లూరు గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా కు చెందిన శివరాత్రి సదయ్య (60), తండ్రి ఎల్లయ్య, అలాగే తురకల మద్దికుంట గ్రామం, పెద్దపల్లి మండలం కు చెందిన గాదాసు రాజయ్య (50), తండ్రి రాజయ్య — ఇద్దరూ కలిసి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.నిందితులు కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను గమనించి, గ్రామస్తుల ద్వారా ఇంటి యజమాని, మేస్త్రి వివరాలు సేకరించేవారు. అనంతరం పలానా మేస్త్రి పంపించాడని, ఇటుకలు వచ్చాయని, ఊరి బయట ట్రాక్టర్లు ఉన్నాయని నమ్మబలికి ముందస్తుగా డబ్బులు తీసుకుని, ట్రాక్టర్లను ఊర్లోకి తీసుకువస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్ మండలాల్లో మొత్తం ఐదుగురిని మోసం చేసి నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ముందస్తు సమాచారం మేరకు నిజామాబాద్ కమాన్ వద్ద కోనరావుపేట ఎస్సై కె. ప్రశాంత్ రెడ్డి తమ సిబ్బంది కె. విశాల్ రాజు, బి. నాగరాజులతో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,000 నగదు, నేరానికి ఉపయోగించిన రెండు నోకియా మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు చేదనలో చురుకుగా పనిచేసిన ఎస్సై మరియు సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ రుత్విక్ సాయి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,గుర్తుతెలియని వ్యక్తులు సరఫరాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మి మోసపోవద్దని, వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.


