జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు
మరికొన్ని పాఠశాలలు బుక్ స్టాలలో విక్రయాలు
దుస్తులు, బూట్లు సైతం స్కూళ్లలోనే..
కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడికి గురి చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో వారికి సంబంధించిన బుక్ స్టాల్లో పుస్తకాలను విక్రయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు. పుస్తకాలపై వారి పాఠశాలల ముద్రలను ఏపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఏమిటి అని అడిగే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మా దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తేనే చదువు చెబుతామనే రీతిలో పాఠశాలలు తయారయ్యాయి. దీంతో దిక్కు లేక తల్లిదండ్రులు సైతం వారి వద్దనే పుస్తకాలను విక్రయించాల్సిన పరిస్థితి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలకు నాలుగు నుంచి 8000 రూపాయలు అవుతున్నాయంటే ఎలా దోపిడికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం పుస్తకాలే కాకుండా విద్యార్థులకు కావలసిన డైరీలు, టై, బెల్టులు, బూట్లు వంటి పలు వస్తువులు వారి స్కూళ్లలోనే విక్రయిస్తూ దోపిడికి పాల్పడుతున్నారు. ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నప్పటికీ పట్టించుకునే అధికారులు కానరావడం లేదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన అధికారులు లేదనడంలో సందేహం లేదు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న దాఖలాలు నామమాత్రం. ఇప్పటికైనా అధికారుల స్పందించి పాఠశాలల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.