Saturday, March 7, 2026

ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు

వేములవాడ, నిఘా న్యూస్:ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి చైర్మన్ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ విస్తరణ, అభివృద్ధి , సుందరీకరణ, మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.వేములవాడ ఆలయాన్ని చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, చేపట్టే పనులు, వాటి స్థితిగతులు తదితరులు అంశాల పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కు వివరించారు.

వేములవాడ కు 35 కిమి పరిసరాలలో ఉన్న కొండగట్టు, నాంపల్లి గుట్ట, సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇతర ఆలయాలు, కరీంనగర్ లోయర్ మ్యానేర్ డాం, ఎలగందుల ఫోర్ట్, అనంత సాగర్ వాటర్ ఫాల్స్, రామడుగు కోట మొదలగు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణానికి ఆధ్యాత్మిక శోభ తీసుకుని వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అన్నారు. దేవాలయం చుట్టుపక్కల అందుబాటులో ఉన్న 36 ఎకరాల భూమి వివరాలు అడిగి తెలుసుకున్నారు.వేములవాడ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో అందుబాటులో ఉన్న 36 ఎకరాల స్థలంలో వసతి గృహాలు, దేవస్థానం కార్యాలయం, పార్కింగ్ , క్యూ కాంప్లెక్స్, సాంస్కృతిక జోన్, బతుకమ్మ పండుగ నిర్వహణకు సాంస్కృతిక వేదిక, ఇతర అభివృద్ధి పనుల కోసం 275 కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపోందించాలని అన్నారు.ప్రస్తుతం అందించే ప్రతిపాదనలు ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో వేములవాడ దేవాలయం ఎంపిక కావడం జరిగిందని, ఆ నిధులను సైతం సమర్ధవంతంగా వినియోగించుకుంటూ వేములవాడ పట్టణ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.వేములవాడ దేవస్థానానికి వచ్చే అత్యధిక రద్దీని అంచనా వేస్తూ అంతకుమించి రద్దీ వచ్చినప్పటికీ ఏర్పాట్లు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. వేములవాడ పట్టణంలోని బస్టాండ్, రాబోయే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి వచ్చే కనెక్టివిటీ రోడ్లు ఆధ్యాత్మిక శోభ ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగాలని అన్నారు.మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడ కూడా ఏ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎటువంటి కార్యాచరణ చేపట్టవద్దని, మన ప్రాంతంలో కొనసాగుతున్న గంగా జమునా తహసిబ్ అదేవిధంగా కొనసాగేలా చూడాలని అన్నారు.

వేములవాడ పట్టణంలో దేవాలయాలకు వచ్చే విధంగా అవసరమైన రోడ్లు, ప్లాట్ ఫార్మ్ , జంక్షన్ సుందరీ కరణ, లైట్ల ఏర్పాటు మొదలగు అభివృద్ధి పనులు 80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. వేములవాడ ప్రధాన దేవాలయ అభివృద్ధి 70 కోట్లతో చేపట్టాలని, దీనికి సంబంధించి ఆధ్యాత్మికతతో కూడిన ప్రణాళికలు ముందుగా తయారు చేయాలని అన్నారు.

అనంతరం పాత్రికేయులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద సేవ ఆలయం ,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే 50 కోట్ల నిధులను మంజూరు చేసిందని, ఆలయ విస్తరణ పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, శృంగేరి పీఠ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని, మొదటి దశలో ఆలయ విస్తరణ శ్రీకారం చుట్టామని, ఆధ్యాత్మిక శోభతో ఉండే విధంగా ఆలయ విస్తరణ పనులు చేస్తామని అన్నారు.

ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం పండితులు భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో కిలోమీటర్ పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలపై ఇచ్చిన జీఓ 149 రద్దు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.ఈ సమావేశంలో , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.ఈ సమావేశం లో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్కిటెక్ బృందం ప్రతినిధులు సూర్య నారయణ మూర్తి, ఆలయ పూజారులు. తదితరులు పాల్గొన్నారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular