సిద్ధిపేట, నిఘా న్యూస్:జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిస్టాపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఎడ్ల గురువారెడ్డి భవనంలో ఈరోజు జరిగిన ఏఐటీయూసీ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మికులపై, రైతులపై దాడులకు పాల్పడుతోందని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను తీసుకురావడం పెట్టుబడిదారుల ప్రయోజనానికే అన్నారు. ప్రజా రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
సుప్రీం కోర్టు ఆదేశించిన న్యాయమైన జీతాల అమలుపై నిర్లక్ష్యం, టెలికం, రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్ శాఖలను ప్రైవేట్ చేయకూడదన్న డిమాండ్లను ప్రస్తావించారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాన్య ప్రజలకు ధరల నియంత్రణలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్ల మల్లేశం, తవసుపల్లి బిక్షపతి, భవన నిర్మాణ రంగా అధ్యక్షులు బేకంటి సంపత్, కార్యదర్శి శివలింగ కృష్ణ, నాయకులు ఐలయ్య, అంజనేయులు, రాజు, శీను తదితరులు పాల్గొన్నారు.