కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఆసక్తికర దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మధ్య మేయర్ పీఠం కోసం రసవత్తర పోరు సాగనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా మేయర్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో పోటీ మరింత ఉధృతమైంది. ఈ రిజర్వేషన్ మూడు పార్టీలకు సమాన అవకాశాలు కల్పించినట్లుగా మారి, వ్యూహాత్మక రాజకీయాలకు దారితీస్తోంది.
బీజేపీ తరఫున కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగర వేయాలని బహిరంగంగా ప్రకటించారు. గత కొంతకాలంగా కరీంనగర్లో బీజేపీ బలపడుతున్న నేపథ్యంతో ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బండి సంజయ్ తన వ్యక్తిగత ఇమేజ్, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీజేపీ క్యాడర్ బలాన్ని ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్లపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం.
ఇక బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరీంనగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్కు ఉన్న పట్టు, స్థానిక నాయకత్వం, కార్పొరేటర్లతో ఉన్న అనుబంధాన్ని ఆయన బలంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. అధికారంలో లేకపోయినా, స్థానికంగా ఇంకా పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కు కొంత ఊరటనిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజా రాజకీయ అడుగులు సమీకరణాలను మార్చేశాయన్న చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్రావును నియమించడం ద్వారా పార్టీకి కొత్త ఊపు వచ్చిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ముందుందని వారు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం అన్న నమ్మకాన్ని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బిఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరడంతో మరోసారి వారికి విజయం దక్కి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మొత్తంగా చూస్తే, బీసీ జనరల్ రిజర్వేషన్, మూడు ప్రధాన పార్టీల అగ్ర నేతల ప్రత్యక్ష ఆసక్తి, స్థానిక రాజకీయాల ప్రభావంతో కరీంనగర్ మేయర్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అన్న ఉత్కంఠతో కరీంనగర్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.


