Sunday, August 3, 2025

తొలి ఎలక్ట్రిక్ బస్ డిపోగా కరీంనగర్

కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) కరీంనగర్‌-2 డిపోను ప్రైవేట్‌ పరం చేస్తోంది. మెజర్స్‌ జేబీఎం అనే సంస్థకు ఈ డిపో నుంచి బస్సులను నడిపించేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ఈ డిపోలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే 35 ఎలక్ర్టిక్‌ బస్సులు డిపోకు చేరుకోగా ఆగస్టు 15 తర్వాత ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. డిపో నుంచి ప్రస్తుతం ఆర్టీసీ 53 సొంత బస్సులు, 52 అద్దె బస్సులను ఆపరేట్‌ చేస్తుండగా 360 మంది ఉద్యోగులు ఈ డిపోలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిపోను ప్రైవేట్‌ పరం చేస్తుండడంతో ఈ బస్సులను, కండక్టర్లు మినహా ఇతర ఉద్యోగులను, ఇతర డిపోలకు పంపించి సర్దుబాటు చేస్తున్నారు. కండక్టర్లను డిపోను అద్దెకు తీసుకున్న జేబీఎం సంస్థలోనే పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ కరీంనగర్‌-2 డిపోతోపాటు నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌ టూ డిపోలను ప్రైవేట్‌ మేనేజిమెంట్‌కు అద్తెకు ఇచ్చి ఎలక్ర్టిక్‌ బస్సులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో కరీంనగర్‌కు 70 ఎలక్ర్టిక్‌ బస్సులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ పరం చేస్తున్న ఆరు డిపోలనుఉంచి 500 ఎలక్ర్టిక్‌ బస్సులను నడపాలని నిర్ణయించారు. వీటిలో టైప్‌-3 ఎలక్ర్టిక్‌ బస్సులతోపాటు నాన్‌ ఏసీ ఇంటర్‌ సిటీ బస్సులు ఉన్నాయి. ఈ డిపోకు 80 ఎలక్ర్టిక్‌ బస్సులను కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. డిపోకు ఇప్పటికే 11కేవీ విద్యుత్‌ లైన్లను వేశారు. 14 చార్జింగ్‌ పాయింట్లకుగాను 12 పాయింట్లను ఇప్పటికే నిర్మించారు. మూడు ఎలక్ర్టిక్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు ట్రాన్స్‌ఫార్మర్ల పనులు పూర్తయ్యాయి. త్వరలో మరో రెండు చార్జింగ్‌ పాయింట్లతోపాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 10నే ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రారంభించాలనుకున్నా 15వ తేదీ తర్వాత ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. రాష్ట్రంలోనే తొలి ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రారంభించిన డిపోగా కరీంనగర్‌-2 డిపో నిలువనున్నది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular