Sunday, August 3, 2025

సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్! జూరాల డ్యామ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జోగులంబా, నిఘా న్యూస్: సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

అదుపు తప్పిన కారు డ్యామ్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పైకి దూసుకు రావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యామ్‌లోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.

వివరాల్లోకి వెళితే, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ (21), జానకిరాములు, ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి జూరాల డ్యామ్ సందర్శనకు వచ్చారు. రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో వారు డ్యామ్ బ్రిడ్జిపై నుంచి గద్వాల వైపు వెళ్తుండగా, కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న కారు అజాగ్రత్తగా, సెల్‌ఫోన్ చూస్తూ మోటారు సైకిళ్లను ఢీకొట్టేందుకు దూసుకొచ్చింది.

ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మహేష్ డ్యామ్‌లో పడిపోయి గల్లంతయ్యాడు. జానకిరాములు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ప్రమాదంతో డ్యామ్ పరిసరాల్లో అలజడి నెలకొంది. గల్లంతైన మహేష్ కోసం జూరాల ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, ధరూర్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆయన ఆచూకీ కనిపించలేదు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular