హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన పరిపాలన, మౌలిక వసతులు కల్పించాలనే బలమైన సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా..ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు , మరో రెండు అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలనే ఆశయంతో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది.గత ఆర్థిక సంవత్సరంలో స్థలాల గుర్తింపులో తలెత్తిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకొని, ఈసారి ప్రారంభం నుంచే ఈ బృహత్తర ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ విస్తృత ప్రణాళికకు ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి మండలానికి రెండు గ్రామపంచాయతీ భవనాలు తో పాటు అంగన్వాడీలు
పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టును అత్యంత కీలకంగా పరిగణిస్తూ.. వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులతో ఆమె నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రి చొరవతో.. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలోనే గణనీయమైన ప్రగతి నమోదైంది.1148 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఇప్పటికే 813 స్థలాలను విజయవంతంగా గుర్తించారు. మిగిలిన 98 చోట్ల భూముల గుర్తింపు పెండింగ్లో ఉంది. అదేవిధంగా.. 1144 గ్రామ పంచాయతీ భవనాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో.. మొదటి త్రైమాసికం ముగియకముందే 549 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మరో 84 చోట్ల భూసేకరణ మిగిలి ఉంది. మిగిలిన నిర్మాణాలు గతంలోనే ప్రారంభమై, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.