ఆయన రాసిన జయ జయహే
తెలంగాణ గేయం కోట్లాది ప్రజల
గొంతుకై నిలిచింది: వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నిఘా న్యూస్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప కళాకారుడిని కోల్పోవడం తీరని విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు.
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలడం బాధాకరమనీ, అందెశ్రీ మరణం పట్ల రాజేందర్ రావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు రాజేందర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


