Tuesday, December 23, 2025

అక్రమ నిర్మాణాల తొలగింపు ఎప్పుడు?

ఇంటి నెంబర్ల రద్దు చేసి నెలలు గడుస్తున్నా.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో వివాదాస్పద భూములపై నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన ఇంటి నెంబర్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వ, శివారు భూములు, లేఅవుట్ అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లపై కఠిన చర్యలుగా ఈ నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ఇంటి నెంబర్లు రద్దు కావడంతో ఆ నిర్మాణాలు అక్రమమేనని స్పష్టమైనప్పటికీ, అవి ఇప్పటివరకు కూల్చివేయబడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.కరీంనగర్ జిల్లాలోని హవేలీ కొత్తపల్లి లో ఉన్న 197, 198, రేకుర్తిలో 185 LR.No.CC 200/97 కింద ఉన్న భూముల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేసి ఇంటి నంబర్లను పొందారు. వీటిపై కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లడంతో మొత్తంగా 476 అక్రమ ఇంటినంబర్లను రద్దు చేశారు, అందులో 175, 197, 198 సర్వే నెంబర్ కు చెందిన భూములు ఉన్నాయి. మొత్తంగా 20 ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా ఇంటి నెంబర్లను పొందినట్లు తెలుస్తోంది. ఇక్కడ కొంతమంది అబద్ధపు సర్వేలు నిర్వహించి ఇంటి నెంబర్లను మొందారు. అయితే లోకాయుక్త నుంచి వచ్చిన ఆదేశాల మేరకి కలెక్టర్ ఈ ఇంటి నెంబర్లను రద్దు చేసింది. అయితే చాలా మంది ఇంటి నెంబర్లన రద్దు చేసినా కూడా వాటి నిర్మాణాలను కూల్చడం లేదు. కొందరు ఇలాంటి నిర్మాణాలను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి కోట్ల రూపాలయతో విక్రయిస్తారు. ఇప్పటికే కొంత మంది బడా నాయకులు వీటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అందుకే ఈ నిర్మాణాలు కూల్చడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి కారణంగానే ఈ తతంగం సాగుతోందని అంటున్నారు. ఇంటి నెంబర్లు రద్దు చేసిన వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని అధికారులు ప్రకటించినా, నెలలు గడుస్తున్నా ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. దీనిపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలైతే వెంటనే కూల్చాలి. మరి ఎందుకు ఆలస్యం?” అని ప్రశ్నిస్తున్నారు.అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు న్యాయపరమైన అడ్డంకులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంటి యజమానులు కోర్టులను ఆశ్రయించడం, స్టే ఆర్డర్లు తీసుకురావడం వల్ల చర్యలు నిలిచిపోతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు, కొన్ని ఇళ్లలో పేద కుటుంబాలు నివసిస్తుండటంతో మానవతా కోణం కూడా అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే, ప్రజల్లో వినిపిస్తున్న ఆరోపణలు మరింత గంభీరంగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక నాయకుల జోక్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే చర్యలు ముందుకు సాగడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. “చిన్నవారిపై చట్టం కఠినంగా ఉంటుంది, కానీ ప్రభావవంతుల విషయంలో నెమ్మదిగా నడుస్తుంది” అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్న ఇళ్లను వేరుగా గుర్తించి, మిగతా అక్రమ నిర్మాణాలను దశలవారీగా కూల్చివేయాలని సూచిస్తున్నారు. లేదంటే, ఇంటి నెంబర్లు రద్దు చేసిన నిర్ణయమే అర్థంలేనిదిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular