టిడిపి నుంచి రాజకీయ పయనం ప్రారంభించి బీజేపీలోకి.. ఇప్పుడు జనసేన వైపు పయనం?
హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు మరో రాజకీయ మలుపు తియ్యబోతున్నారని ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. మొదట తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుంచి రాజకీయ ప్రస్థానం మరియు కార్పొరేటర్గా గెలిచి ప్రజా సేవలోకి వచ్చిన ఆయన, తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)లోకి చేరి మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ప్రస్తుతం జనసేన పార్టీ వైపు ఆయన దృష్టి మళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజాసింగ్ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. యువ వయస్సులోనే హిందూ సంస్కృతి, గోరక్షణ, హిందుత్వ భావజాలం పట్ల ఆకర్షితులై, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టిడిపి కార్పొరేటర్గా ప్రారంభించారు. ప్రజలతో మమేకమైన వాఖ్యాన శైలి, బలమైన హిందూ ధర్మ నిబద్ధత ఆయనకు విశేష ఆదరణ తీసుకొచ్చింది.
మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా..
2014, 2018, మరియు 2023లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున రాజాసింగ్ వరుసగా మూడుసార్లు గెలుపొందారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన హిందూత్వ నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే 2022లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోవడం, పార్టీ పట్ల పెరిగిన అసంతృప్తి, పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండడం ప్రస్తుతం కనిపిస్తున్న దిశ.
జనసేన వైపు కొత్త ప్రయాణం?
ఇటీవల పవన్ కళ్యాణ్ నాయకత్వంపై రాజాసింగ్ ప్రశంసలు వెలిబుచ్చడం, ప్రభుత్వంపై తన విమర్శలను జనసేన అభిప్రాయాలతో సింక్ చేస్తూ ఉండడం విశేషంగా మారింది. ఆయన జనసేనలో చేరే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఆయన సమీప వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జనసేనలో బలమైన హిందూత్వ వాదనలకు ఆదరణ ఉండటంతో, ఆయనకు ఆ పార్టీలో మంచి ప్లాట్ఫాం దక్కే అవకాశం ఉంది.
రాజకీయాలపై ఆయన కొత్త దృష్టి
రాజాసింగ్ మళ్లీ ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టి, వరుసగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిరంతరం చురుకుగా స్పందిస్తూ, రాజకీయ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.